ఆంధ్రజ్యోతి ఆదివారం ప్రచురణ
1.
“శ్రీజా!
బట్టలన్నీ
సర్దేసుకున్నావా?” అంది
అమ్మ ఆఫీసు నుండి ఇంట్లోకి
అడుగుపెడుతూనే.
“ఆఁ
సర్దుకున్నానమ్మా!”
అన్నాను.
“ఏం
సర్దుకున్నావో చూపించు -
పద" అంది.
“అబ్బబ్బ!
సర్దుకున్నాలేమ్మా!
ఇంకాసేపట్లో బస్సు
వస్తుంది! టైమ్
లేదు" అన్నాను
విసుగ్గా.
“అది
కాదు శ్రీ - ఏమైనా
మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది
పడతావు ఊరు గాని ఊర్లో"
అంటూ సూట్ కేసు
తీసి అన్నీ చెక్ చేసింది.
“షిమ్మీలు
పెట్టుకోలేదేమే"
“ఇన్నర్స్
పెట్టుకున్నానుగామ్మా!
మళ్ళీ షిమ్మీలెందుకు?”
“శ్రీ,
ఇన్నర్స్ పైన
షిమ్మీలు వేసుకోవాలి -
ముఖ్యంగా బయటికి
వెళ్ళినపుడు - తీసుకురా"
అంది కోపంగా.
అలమరా
తీసి షిమ్మీలు తెస్తూ 'చెక్
చేయడం అయింది ఇక ఇప్పుడు
జాగ్రత్తల ఉపన్యాసం వినాలి'
అనుకున్నాను.
నా
చేతుల్లోంచి షిమ్మీలు తీసుకుని
సూట్ కేస్ లో సర్దుతూ "ఇంజనీరింగ్
చదువుతున్నాను జాగ్రత్తలు
నాకు తెలియదా నువ్వు చెప్పకపోతే
అని అనుకుంటున్నావ'ని
నాకు తెలుసు. ఏదైనా
జరిగితే బాధ పడతాం కాబట్టి
జాగ్రత్తలు చెప్తాం"
అంది.
నాకు
రాహుల్ గుర్తొచ్చాడు.
నేను రాహుల్ ని
ప్రేమిస్తున్నానని,
చదువయ్యాక ఇద్దరం
పెళ్ళి చేసుకుంటామని చెబ్దామని
నోటిదాకా వచ్చింది కాని ఆమె
ఏమంటుందో? 'మూడ్
చెడిపోతే మళ్ళీ ఎక్స్ కర్షన్
ఎంజాయ్ చేయలేను' అనుకుని
అమ్మ చెప్తున్న జాగ్రత్తలకి
'ఊ' కొడుతూ
ఉండిపోయాను.
“భలే
ఆంటీ మీరు....! దానికి
చిన్నపిల్లకి చెప్తున్నట్లు
జాగ్రత్తలు చెప్తున్నారు"
అంది శ్రుతి.
హాల్లో నిలబడి
గదిలో మేం మాట్లాడుకుంటున్నవన్నీ
విన్నట్లే ఉంది దాని వాలకం
చూస్తుంటే.
“దా!
శ్రుతీ! ఇద్దరూ
జాగ్రత్తమ్మా!” అంది
అమ్మ.
“అయ్యో!
ఆంటీ! ఏంటి
జాగ్రత్త? మీకే
ఆపదా రాకుండా తొడుగులేసుకోండి
అని చెప్తున్న కాలం ఇది.
మీరేమో ఇంకా బిసి
కాలపు జాగ్రత్తలు చెప్తున్నారు"
అంది.
“శరీరాంగాలకి
తొడుగులు వేసుకోగలరేమో
శ్రుతీ.... కానీ
మనసుకేం తొడుగులు వేసుకోగలరు?
దానికే విధంగా
సమాధానం చెప్పగలరు?”
అంది అమ్మ.
ఆమె గొంతులోని
కఠినత్వానికి అన్నింటినీ
తేలిగ్గా తీసుకుని కొట్టి
పారేసినట్లుగా సమాధానం చెప్పే
శ్రుతి అమ్మ కళ్ళల్లోకి
చూడలేనట్లుగా తల వంచుకుంది.
బయట
నుండి బస్ హారన్ మోగడంతో
"పదండి
బయలుదేరండి" అంది
అమ్మ.
బస్సెక్కాక
"అమ్మ ఎప్పుడూ
అంతేలే. చాదస్తం.
నువ్వేమీ అనుకోకు"
అన్నాను.
"ఇట్స్
ఓకె" అంది
శ్రుతి భుజాలెగరేస్తూ.
2.
మా
ఇంజనీరింగ్ ఫైనల్ విద్యార్థులకి
వీడ్కోలు పలుకుతూ కాలేజీ
వాళ్ళు ఏర్పాటు చేసిన ఎక్స్
కర్షన్ ఇది. హార్సిలీ
హిల్స్ లో కాటేజ్ లు బుక్
చేశారు. రాత్రి
బస్ లో రాహుల్ నన్ను నిద్రపోనీయకుండా
నా పక్కపక్కనే తిరుగుతూ
లెక్చరర్స్ చూడకుండా నన్ను
తాకుతూ కొంటె పనులు చేస్తూనే
ఉన్నాడు. వేకువఝాము
నాలుగుకి హార్సిలీ హిల్స్
చేరుకున్నాము. కాటేజ్
లోకి వెళ్ళి అన్నీ సర్దుకుని
కాసేపు పడుకున్నామో లేదో
రేణుక మేడమ్ అందరినీ బయలుదేరతీసింది.
ఆ ఉదయం అక్కడున్న
చిన్న జూ, గుడీ,
ఆ కొండంతా తిరిగి
చూశాం. దాదాపు
9 అవుతుండగా
బస్ ఎక్కి కిందకి వచ్చి ప్రపంచ
ప్రఖ్యాతి నొందిన రిషీవ్యాలీ
స్కూలుకి వెళ్ళాము.
స్కూలు చూశాక అక్కడ
నుండి కొంచెం దూరంలో ఉన్న
తెట్టు వేణుగోపాలస్వామి ఆలయం
చూసి వస్తూ వస్తూ దారిలో
గంగమ్మ గుడి దగ్గర బస్సు ఆపారు
భోజనాల కోసమని.
ఊళ్ళో
ఉన్న హోటల్లో నుండి భోజనాలు
వచ్చాయి. గంగమ్మ
గుడి దగ్గర ఉన్న ఇళ్ళల్లో
వాళ్ళు టార్పాలిన్ పట్టలు,
చాపలు తెచ్చిచ్చారు.
ఆ చేలల్లోనే చాపలు
పరుచుకుని భోజనాలు చేశాం.
మా ఆడపిల్లల చుట్టూ
తిరుగుతూ కొందరు, ఏవేవో
కబుర్లు చెప్పుకుంటూ కొందరు
- వాతావరణం
చాలా ఉత్సాహంగా ఉంది.
రాహుల్ కళ్ళల్లో
రాత్రి బస్ లో చేసిన అల్లరి
పనుల తాలూకు ఆనందం.
భోంచేశాక
చేతులు కడుక్కోవడానికి గుడికి
దగ్గరగా ఉన్న ట్యాంక్ దగ్గరకి
వెళ్ళాం.
“శ్రీ!
రాత్రికి మేం మీ
రూమ్ కొస్తాం. తలుపు
గడి వేసుకోకండి. దగ్గరగా
వేసి ఉంచండి" అన్నాడు
రాహుల్ నాకు దగ్గరగా వచ్చి
చేతులు కడుక్కుంటూ.
“వద్దు
- వద్దొద్దు"
అన్నాను కంగారుగా.
పైకైతే అలా అన్నా
కాని నా శరీరం లో వణుకు స్పష్టంగా
కావాలంటోంది.
అప్పటికే
రాహుల్ విననట్లుగా పక్కకి
వెళ్ళిపోయాడు. నాకు
గుండె దడ దడలాడసాగింది.
మగపిల్లలు గర్ల్
ఫ్రెండ్స్ ని కలుసుకోవడానికి
వేసుకున్న ప్లాన్ లెక్చరర్స్
కి ఎక్కడ తెలిసిపోతుందనో లేక
మరెందుకో ఏదో కంగారు మా
ఆడపిల్లలందరి ముఖాల్లో
కనపడుతోంది. అంత
ధైర్యంగా మాట్లాడే శ్రుతి
కూడా నా దగ్గరకొచ్చి "రాహుల్
కూడా వస్తానన్నాడా?”
అంది ఆత్రమూ,
ఆందోళన కలగలిసిన
గొంతుతో.
“ఊఁ
వద్దన్నా వినేట్లుగా లేరే"
అన్నాను.
“ష్!
సాయంత్రం మాట్లాడుకుందాం"
అందది.
అందరూ
భోంచేశాక మిగిలిన పదార్థాలని
అక్కడున్న ఇళ్ళల్లో వాళ్ళని
పిలిచి ఇచ్చేసింది రేణుక
మేడమ్. లెక్చరర్స్
అందరూ భుక్తాయాసంతో చాపల మీద
వాలినట్లుగా పడుకున్నారు.
మేము అక్కడక్కడే
తచ్చట్లాడుతున్నాం.
పిల్లలు తమ కళ్ళకి
కనపడనంత దూరం వెళ్తున్నారని
గమనిస్తే మాత్రం పిలిచి
దగ్గరగా కూర్చోబెడుతున్నారు.
“అబ్బబ్బ!
ఏం కాపలా కాస్తారో
చూడు. స్వేచ్ఛలేని
బతుకు" విసుక్కుంటున్న
శ్రుతి మాటలకి అందరం ఫక్కున
నవ్వాం.
సాయంత్రం
నాలుగవుతోంది. కొండల
చాటుకి వెళ్ళి సంధ్యాదేవిని
కలుసుకోవాలనే తాపత్రయంతో
సూర్యుడు పక్కకి వాలుతున్నాడు.
రేణుక మేడమ్ లేచి
వెళ్ళి అక్కడున్న ఇళ్ళల్లో
వాళ్ళతో మాట్లాడి టీకి ఏర్పాటు
చేసింది. అప్పుడే
పిండిన పాలతో వాళ్ళు టీ తయారు
చేసి ఇచ్చారు.
“టీ
చాలా బావుంది తాతా! ఇక
బయలు దేరతాం" అంది
రేణుక మేడమ్ టీ తెచ్చిన తాతకి
డబ్బులు ఇస్తూ.
“ఇంకాసేపున్నారంటే
ముగ్గురక్కచెల్లెళ్ళ కొండ
గుండా కిందికి దిగే సూర్యుణ్ణి
చూడొచ్చు. ఇక్కడికి
అందరూ అది చూడటానికే కార్లేసుకుని
మరీ వచ్చి చూసి పోతారు"
అన్నాడు ఆ తాత.
'ముగ్గురు
అక్కచెల్లెళ్ళ కొండా!?'
అనుకుంటూ మాకు
వెనగ్గా ఒకదానికొకటి ఆనుకుని
ఉన్నట్లు కనిపిస్తున్న మూడు
కొండల వైపు చూశాం.
“ముగ్గురక్కచెల్లెళ్ళ
కొండని ఎందుకంటారు?”
మాలో చాలా మందిమి
లెక్చరర్స్ తో సహా ఒకేసారి
అడిగాం.
“వీటికి
పెద్ద కథ ఉంది" అన్నాడు.
నిట్టూర్పు వెలువడింది
అతని గొంతు నుంచి.
ఆ
శబ్దం మాకింకా ఆసక్తిని
కలిగించింది. అందరం
ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయి
ఆ కొండలనే చూడసాగాం.
“కథ
చెప్పు తాతా" అంది
రేణుక మేడమ్.
తాత
మౌనంగా ఉన్నాడు ఒక్క మాట కూడా
మాట్లాడకుండా.
“చెప్పు
తాతా! ఎందుకలా
ముగ్గురక్కచెల్లెళ్ళ కొండంటారో
చెప్పు తాతా ప్లీజ్.
నీకు తెలుసు కదా!"
అందరం గోలగోలగా
అరుస్తూ అతని చుట్టూ చేరాం.
“తెలుసు
గాని నేను బాగా చెప్పలేనులేమ్మా!
ఆడదాని మనస్సు మరో
ఆడదానికే తెలిసిద్ది అంటారు.
ఉండండి మా భార్యని
పిలచకొస్తా అది చెప్పిద్ది"
అన్నాడు.
దూరంగా
పొయ్యి ముందు కూర్చని నీళ్ళు
కాగబెడుతున్న తన భార్యని
కేకేశాడు. “ఏమ్మే
వీళ్ళకి ఆ ముగ్గురక్కచెల్లెళ్ళ
కథంటా చెప్పు. నువ్వయితే
బాగా చెప్తావు" అన్నాడు
మా దగ్గరకొచ్చిన ఆవిడతో.
నుదుటున
పెద్ద కుంకుమ బొట్టు,
ముదురాకు పచ్చ రంగు
చీర, ఎర్ర
జాకెట్టు వేసుకున్న ఆవిడ
ఇంతకు ముందు చూసిన గంగమ్మ
గుడిలోని గంగమ్మలా ఉంది.
సూర్యుడు అస్తమించడానికి
ఆయత్తమవుతూ కొండల మీదకి
చేరాడు. వేగంగా
సాగిపోతున్న మబ్బుల విసురుకి
చల్లని గాలులు సన్నటి నొక్కుల
రాగాలు వినిపిస్తున్నాయి.
ఆమె నిలబడే కథ
చెప్తోంది. మేము
మాత్రం బుద్ధిమంతులైన
స్టూడెంట్స్ లా చాపల మీద
కూర్చున్నాం వరసగా.
3.
“ఇదిగో
పాపలూ! ఈమె
పెద్దామె. పేరు
సరోజిని. మధ్యలో
ఉన్నామె నడిపామె సితార.
అదిగో ఆ చివర ఉందే
ఆమె విశారద. వాళ్ళ
నాయన మారాజు. ముగ్గురికీ
బ్రహ్మాండమైన మూడు కోటలు
కట్టిచ్చాడు. ఆ
రాజు చచ్చిపోయే ముందు ముగ్గురినీ
పిలిచి 'పాపల్లారా!
మీకు నచ్చిన వాళ్ళని
పెళ్ళి చేసుకుని సుఖంగా
బతకండి. మీ
మనసుకు ఏమైనా బాధ కలిగితే
మాత్రం మాయమైపోయి మనూరి గంగమ్మ
గుడి కాడకెళ్ళిపోండి.
ఆ యమ్మే మీ యమ్మ.
అదే మీకు పుట్టిల్లు'
అని చెప్పి చచ్చిపోయాడు.
ముగ్గురక్కచెల్లెళ్ళూ
ఎవరికి కట్టిచ్చినింట్లో
వాళ్ళు కాలం గడుపుతున్నారు.
కొన్నాళ్ళకి
ముగ్గురికీ పెళ్ళీడొచ్చింది.
పెద్దామె
సరోజినికి ఒకటే స్నేహితుల
పిచ్చి షికార్ల పిచ్చి.
ఒకసారి స్నేహితులతో
హిమాలయాలకి షికారుకి పోయింది.
అక్కడ ఒక గూడారం
వేయించుకుని సరదాగా కాలం
గడుపుతోంది. ఒకరోజు
సాయంత్రం స్నేహితులు లేకుండా
ఒక్కతే ఆ మంచు కొండల్లో
తిరుగుతుంటే ఒకబ్బాయి
కనిపించాడు. అబ్బో
అతను భలే అందంగా ఉన్నాడంట.
ఆ అబ్బాయి నేరుగా
ఈమె దగ్దరకే వచ్చి 'నేను
దారి తప్పాను ఫలానాది మా ఊరు
నీకు దారి తెలుసా' అని
అడిగాడంట. ఈ
సరోజినికి అతన్ని అతని అందాన్ని
చూసేప్పటికి ప్రేమ పొంగిపోయింది.
తన అందానికి సరైన
జోడు ఇతనే అనుకుని పెళ్ళి
చేసుకోమని అడిగింది.
అతను 'ఇదేమిటమ్మా
దారి అడిగితే పెళ్ళంటావ'ని
వెళ్ళిపోసాగాడు.
సరోజిని
అతన్ని వదలకుండా వెంట పడింది.
'ఊరుకోవమ్మా నువ్వు.
నాకిదివరకే
పెళ్ళయింది. దారి
తప్పి నేనేడుస్తుంటే ఏంటీ
గోల' అంటా ఒక్క
తోపు తోసి వెళ్ళిపోయాడు.
'ఇదిగో నువ్వు వచ్చి
నన్ను పెళ్ళి చేసుకున్నావా
సరే లేకపోతే ఇక్కడే ఈ మంచులో
పడి చచ్చిపోతా' అని
అరిచింది. అతను
పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు.
అవమానంతో ఆ పిల్ల
ఏడుస్తూ మంచులో పడి ఉంది.
ఇదంతా చూస్తున్న
దారులు కొట్టే దొంగ ఒకడు చీకటి
పడ్డాక ఆమె పక్కకి చేరి ఆ
అందమైన యువకుడిలాగే నటించి
లోబరుచుకున్నాడు. తను
కోరుకున్న ప్రియుడే మళ్ళీ
వచ్చాడనుకుని ఈ దొంగతో సంతోషంగా
గడిపింది. తెల్లవారింది.
ప్రియుడిని కళ్ళారా
చూసుకుందామని చూస్తే వేరే
ఎవరో..... 'ఛీ!
ఛీ!' అనుకుని
బాధతో ముఖం మాడ్చుకుని మాయమై
గంగమ్మ గుడి కాడొచ్చి పడింది.
4.
ఇక
రెండో ఆమె సితారకి ఒక పెంపుడు
పావురం ఉంది. ఆ
పాప ఓ వసంతకాలం ఆ పావురాన్ని
ముద్దాడి 'ఒసే
పావురమా! నాకు
కాబోయే మొగుడిని నువ్వే
తీసుకురా. ఎవరినంటే
వాళ్ళని తీసుకురాకే,
మంచి వాడిని మనసున్న
వాడిని తీసుకురా సరేనా'
అంది. పావురం
కువకువలాడుతూ తూరుపు దిక్కుగా
ఎగిరిపోయింది. అది
పోయి పోయి కుండలు చేసుకుంటున్న
అందమైన కుర్రోడిని చూసింది.
ఆ ఇంటి గోడ మీద
కూర్చుని సితార అందాన్ని
గురించి వర్ణించి వర్ణించి
చెప్పి అతన్ని వెంటబెట్టుకుని
తీసుకొచ్చింది.
పావురం
వెంట కోటలోకి వస్తున్న ఆ
కుమ్మరిని చూస్తానే సితార
అతని పైన మనసు పారేసుకుంది.
లోపలకి పిలుచుకోని
తలుపేసుకుంది. అంతే
కుమ్మరి చేతిలో కుండలా రకరకాల
వంపులు తిరిగిపోయింది.
ఆరు నెలలు బయట ముఖం
చూడకుండా భోగాలల్లో తేలిపోయారు.
ఒకరోజు ఏదో మాటల్లో
కుమ్మరికి తన ఇల్లు గుర్తొచ్చింది.
'పెళ్ళి చేసుకోని
మా ఇంటికి తీసుకుపోతా పద'
అన్నాడు. 'మరి
నాకే కష్టమూ రాకుండా,
ఏ దెబ్బా తగలకుండా
చూసుకుంటావా?' అంది.
'నీ కెందుకు కష్టం
కలిగిస్తాను? నీ
కాల్లో ముల్లు గుచ్చుకున్నా
నేను భరించలేను' అన్నాడు.
సితారకి నమ్మకం
కలగలేదు. పెళ్ళి
మాట ఎత్తకుండా కాలం గడిపేస్తోంది.
రోజులు గడిచిపోతున్నాయి.
ఇక కుమ్మరి ఆగలేక
'తన ఊరికి
పోవాల'ని
వత్తిడి తెచ్చాడు.
అప్పుడు
సితార అతన్ని పరీక్షించాలనుకుని
అతన్ని దగ్గరగా పిలిచి 'ఈరోజు
నాకొక అపాయం రానుంది.
అందుకే ఇన్నాళ్ళూ
నీతో పెళ్ళికి ఒప్పుకోలేదు.
అదిగో ఆ పడమర వైపున్న
కిటికీలోంచి ఇప్పుడు ఒక నల్లని
పక్షి వచ్చి నన్ను దాని ముక్కుతో
పొడిచి చంపేస్తుంది.
దానికి నేను కనపడకుండా
ఉండాలంటే నువ్వు నన్ను ఈ
దబ్బనంతో పొడువు. నేను
కప్పగా మారిపోతాను. ఆ
పక్షి నేను కనపడక వెళ్ళిపోతుంది.
అది వెళ్ళాక దబ్బనంతో
మళ్ళీ పొడిచావంటే మామూలుగా
మారిపోతాను. ఈ
గండం గడిస్తే మనం పెళ్ళి
చేసుకుని మీ ఊరికి వెళ్ళిపోదాం'
అంది.
'ఆ
పక్షి ఏదో రానీ చూద్దాం దానికి
నా ప్రాణాలని ఎరగా వేస్తా
కావాలంటే అంతేగాని నా చేతులతో
నేను నిన్ను ఎలా పొడవగలను'
అని అంటాడనుకుంది
పాపం సితార. తొందరగా
పెళ్ళి చేసుకుని తీసుకోని
పోవాలన్న ఆత్రమో ఏం పాడో ఆ
కుమ్మరి, మూలనున్న
దబ్బనం తీసుకోని ఆ పాపని
పొడిచాడు. అంతే
మనసు ముక్కలై గంగమ్మ గుడికాడికొచ్చి
పడింది.
5.
మూడో
ఆమె విశారద. చాలా
మంచి మనసుగలది. మొదటి
ఇద్దరూ మూర్ఖత్వంతో ఒకరు,
అవసరం లేని అనుమానంతో
ఒకరు బాధ పడితే విశారద తన
అవివేకం, మంచితనం
వల్ల బాధ పడింది.
ఈమెకి
పువ్వులన్నా, పుస్తకాలన్నా
ప్రాణం. తన
కోట చుట్టూ అందమైన పూలతోటని
వేసుకుంది. తోటమాలికి
తోట పక్కనే ఇల్లు కట్టించి
ఇచ్చింది. రోజులు
గడవగా గడవగా ఆ తోటమాలిని
నమ్ముకుని వచ్చిన అతని బంధువులు,
అతని భార్య వైపు
బంధువులు అందరూ అక్కడే ఇళ్ళు
కట్టుకుని ఉండసాగారు.
ఒకరోజు
తోటలో విహారానికి వచ్చిన
విశారద అక్కడ బండ మీద కూర్చుని
చదువుకుంటున్న ఒక అబ్బాయిని
చూసింది. అతను
తన కంటే వయసులో చిన్నవాడని
తెలుస్తోంది. అతనికి
దగ్గరగా వెళ్లి 'ఎవర్నువ్వు?'
అంది. 'మీ
తోటమాలి గారి బావమరిదిని'
అన్నాడు. 'ఏం
చదువుతున్నావు?' అంటూ
చనువుగా అతని మీదికి వంగి
అతని చేతిలోని పుస్తకాన్ని
తీసుకుంది.
అంత
అందమైన రాజకుమారి, పైగా
యజమానురాలిని అంత దగ్గరగా
చూసిన అతను చిన్నగా వణికాడు.
అతని వణుకు ఆమెకి
ఆశ్చర్యం కలిగించింది.
అతని దగ్గరనుంచి
తీసుకున్న ఆ పుస్తకం గురించి
ఇద్దరూ చర్చించుకున్నారు.
అప్పటి నుంచీ అతని
దగ్గరున్న పుస్తకాలని గురించి
అతను చెప్తే ఆమె దగ్గరున్న
పుస్తకాల గురించి ఆమె చెప్పేది.
పుస్తకాలు
అందుకుంటున్నప్పుడు,
వాటి గురించి
మాట్లాడుకునేప్పుడు ఇద్దరూ
పరవశంలో మునిగి తేలేవారు.
తను అతనికి దగ్గరగా
వెళ్ళినపుడు అతని శరీరం సుగంధం
వెదజల్లాలని కొత్త బట్టలు,
రకరకాల సబ్బులు,
తైలాలు, సెంట్లు
ఇచ్చేది.
ఒకరోజు
బయట కుండపోతగా వాన పడుతోన్న
వేళ ఒకరికొకరు తెలియకుండానే
చేరువయ్యారు. ఆమె
పూర్తిగా అతని మత్తులో
పడిపోయింది. అతని
కోసం ఇల్లు దానిలో అన్ని
హంగులూ అమర్చింది.
కొన్నాళ్ళయ్యాక
పెళ్ళి చేసుకుందామని అడిగింది.
'నువ్వు నాకంటే
పెద్దదానివి కదా! పెళ్ళి
చేసుకుంటే ఆయుక్షీణం.
పెళ్ళి చేసుకోపోతే
ఏం? జీవితాంతం
మనిద్దరం ఇలానే ఉందాం -
పుస్తకాల గురించి
మాట్లాడుకుంటూ....' అన్నాడు.
నమ్మింది.
రేయింబవళ్ళు అతని
గురించే ఆలోచించేది.
అతనే లోకంగా
బ్రతికింది.
ఒకరోజు
వేకువఝామున ఆమెకేదో పీడకల
వచ్చి అతన్ని చూడాలన్న ఆత్రంతో
తెల్లవారుతూనే అతని ఇంటికి
వెళ్ళింది. అక్కడున్న
ఇళ్ళల్లో ఎవ్వరూ లేరు.
చింతచెట్టు కింద
కుక్కి మంచంలో కూర్చుని ఉన్న
తాత దగ్గరకి వెళ్ళి 'తాతా!
వీళ్ళందరూ ఏరి?'
అంది. 'మీ
తోటమాలి గారి బావమరిది పెళ్ళికి
రాత్రి అందరూ తరలి వెళ్ళారమ్మా!
మీకు తెలియదా?'
అంటుండగానే పెళ్ళికి
వెళ్ళిన వారు పెళ్ళికూతురూ,
పెళ్ళికొడుకుతో
సహా బళ్ళు దిగారు.
ఆమెని
అక్కడ చూసిన అతను తడబడుతూ
భార్యని ఇంట్లోకి పంపించి
ఆమె దగ్గరకి వచ్చాడు.
'ఇంట్లో వాళ్ళ బలవంతం
మీద పెళ్ళి చేసుకున్నాను.
నీకు చెప్తే నువ్వు
బాధ పడతావని చెప్పలేదు'
అని నమ్మబలికాడు.
మళ్ళీ నమ్మింది.
'తను నాకంటే చిన్నవాడు
కదా ఇంట్లో వాళ్ళు మా పెళ్ళికి
ఎలా ఒప్పుకుంటారు? పోనీలే
నన్ను పెళ్ళి చేసుకోపోతే ఏం
అతనికి నా మీదే ప్రేమ'
అనుకుంది.
కాని తన ప్రవర్తన
సాటి ఆడదాన్ని ఎంత బాధిస్తుందో
తెలుసుకోలేకపోయింది.
అతన్ని తన కోటలోకి
పిలిపించుకోవడం, అతని
అవసరాలు తీర్చడం మళ్ళీ
మామూలుగానే జరిగిపోతోంది.
ఒకరోజు
అతను రాలేదు. ఒక్కరోజు
కూడా అతన్ని చూడకుండా ఉండలేని
విశారద అతని ఇంటికి వెళ్ళింది.
ఈమెని అక్కడ చూడగానే
అతని భార్య 'నీకు
నా మొగుడే కావలసి వచ్చాడంటే
పద బయటికి' అంది.
అసలా మాట ఊహించని
విశారద ముఖం మ్లానమైంది.
సహాయం కోసం అతని
వైపు కన్నీళ్ళతో చూసింది.
'ఆమె వల్లే ఈరోజు
మనం ఈ భోగభాగ్యాలని అనుభవిస్తున్నాం.
ఇది ఆమె ఇల్లే'
అని భార్యని
మందలిస్తాడనుకుంది.
కాని అతను
'ఎందుకొచ్చావిక్కడకి
నా కాపురం తీద్దామనా?'
అన్నాడు. అంతే
ఆమె గుండె పగిలింది.
గంగమ్మ గుడికాడికొచ్చి
పడింది.
ముగ్గురక్కచెల్లెళ్ళూ
తమ కథలని ఆ గంగమ్మతో చెప్పుకుని
ఎవరికీ ముఖం చూపించలేక ఇలా
కొండలుగా మారిపోయారు.
ఇదే ఆ అక్కచెల్లెళ్ళ
కొండ" కథ
ముగించి మమ్మల్ని వేదనలో
ముంచేసి ఆ ముత్తయిదువు నిబ్బరంగా
నడిచి పోయింది. ఆ
కొండలనే చూస్తూ ఒక నిమిషం
పాటు అందరం అలా నిలబడిపోయాం.
6.
సూర్యుడు
కొండల కిందుగా దిగిపోతున్నాడు.
తన కోసం క్రమం
తప్పకుండా వచ్చే భానుడిని
గర్వంగా చూసుకుంటూ సాయంసంధ్య
సిగ్గుల రంగైన కెంజాయిని
విరజిమ్ముతోంది.
కథ
విని మౌనంగా మారిన నా మనసుని
ఆ అద్భుత దృశ్యం మరింత లోతుల్లోకి
తీసుకెళ్ళి వదిలినట్లయింది.
అమ్మ
గుర్తొచ్చింది. ఆమె
మాటలు ఇప్పుడు నాకు అర్థం
అయ్యాయి. గంభీరంగా
మారిన నా ముఖాన్ని చూసిన
రాహుల్ కళ్ళల్లోని అల్లరి
మాయమయింది. ఆ
రాత్రి మా గది తలుపులు తీశారో,
ఎవరైనా వచ్చారో
లేదో నేను పట్టించుకోలేదు.
నన్ను మాత్రం ఎవ్వరూ
డిస్టర్బ్ చేయలేదు.
*****
(మెహర్
గారికి కృతజ్ఞతలతో)
No comments:
Post a Comment
P